EPISODE · Jan 13, 2021 · 34 MIN
రోహిణి - పతంజలి శాస్త్రి గారి కథ , కథా పరిచయం
from Harshaneeyam
రోహిణి’ పతంజలి శాస్త్రి గారి ‘రామేశ్వరం కాకులు’ అనే కథాసంకలనం లోనిది.• ఈ కథపై చక్కని సూచనలిచ్చి, ఆడియోని మీకందించడానికి సహకరించిన మిత్రులు ఛాయా మోహన్ గారికి కృతజ్ఞతలు.**’రామేశ్వరం కాకులు పుస్తకం’ అమెజాన్ లో దొరుకుతోంది. – http://amzn.to/3bFv5W2.కథనం:చరిత్ర లోని ఒక కథను Allegorical గా తీసుకొని, సమకాలీన సమస్యను ఎత్తిచూపుతూ, ఒక పరిష్కార మార్గాన్ని సూచనగా చెప్పడం, ఈ కథలో ముఖ్య ప్రక్రియ. ఈ ప్రక్రియ తో తెలుగు లో వచ్చిన మరో రెండు కథలు – చలం గారి ‘ ఓ పువ్వు పూసింది’ రావూరి భరద్వాజ గారి ‘ పాటకు తగిన రోలు’.కథలో ముఖ్యాంశం నదీజలాల వివాదం. రోహిణి నదీజలాల పై శాక్య , కోలీయుల వివాదం గురించి రెండు కథనాలు ప్రచారంలో వున్నాయి.తాను చూసిన కొన్ని సంఘటనల వల్ల సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడుగా మారిన తర్వాత,జలాల గురించి ఇరువర్గాలూ యుద్దానికి సిద్ధమైతే, గౌతముడు యుద్ధభూమికి వెళ్లినట్టుగా, ఆయన సమక్షంలో ఇరు వర్గాలూ తమ ఆయుధాలు విసర్జించి యుద్ధాన్ని మానివేశాయి అని ఒక కథనం చెప్తే… ( http://bit.ly/warsankyans)శాక్య వంశానికి చెందిన సిద్ధార్థుడు, జలాల వివాదం మీద జరిగిన శాక్యుల సమావేశంలో , తాను యుద్ధం యొక్క ఫలితాలను, అనర్థాలను ఎత్తిచూపినప్పుడు, వర్ణాశ్రమ ధర్మం గురించి చర్చ జరగడం, యుద్ధానికే, ఎక్కువమంది మొగ్గు చూపడంతో , వ్యతిరేకిస్తూ , సిద్ధార్థుడు సన్యసించడం , ఆ తరువాత కొంత కాలానికి ఇరువర్గాలూ యుద్ధాన్ని విరమించడం రెండో కథనం. (http://bit.ly/ambedkars (24-29, 56-57))పతంజలి శాస్త్రి గారు రాసిన ఈ కథలోని విశేషం, ఈ రెండు కథనాలనూ సమన్వయం చేయడం.ఇలా ఒకే చారిత్రిక ఇతివృత్తం పై వున్న రెండు వేరు వేరు కథనాలలోని ముఖ్య అంశాలను స్పృశిస్తూ, ఒక సమకాలీన సమస్యకు పరిష్కార మార్గాన్ని సూచించారు ఈ కథ ద్వారా రచయిత.కథలోని సమస్య గురించే గాక , నేటి సమాజంలో ఉండే ఎన్నో ప్రధాన సమస్యలపై , పరిష్కారం దిశగా, గౌతముని వాక్యాలను ఎన్నుకుని కథలో భాగంగా మనకందించడం శాస్త్రి గారి రచనా ప్రతిభకు ఒక నిదర్శనం.ఏ సమస్య పరిష్కారానికైనా , సరైన దృక్పధం, సమస్య పరిమితులు అర్థం చేసుకోవడం ముఖ్యమన్న విషయం కథ మనకు తెలియజెప్తుంది.కథలో భాగంగానే, ఈనాటి సామాజిక వర్గీకరణను సూచిస్త, వ్యాపార, శ్రామిక వర్గాలకు ఉండవలసిన సరైన దృక్పధం గురించి , వారికి సమాజం పట్ల ఉండవలసిన బాధ్యత గురించి కూడా చర్చించడం జరుగుతుంది.కథ చివరి అంకం అంతా గౌతమ బుద్ధుడి ఆశ్రమంలో జరగడం, చర్చలకు కావలసిన వాతావరణం ప్రాధాన్యత ను గురించి రచయిత చెప్పినట్టుగా ఉంటుంది. అదే విధంగా రోహిణి నదిని వర్ణించేటప్పుడు , కథలో రాబోయే సందర్భం గురించి సూచిస్తున్నట్టుగా ఉంటుంది.కథలో ముఖ్యంగా గమనించవలసింది గౌతమబుద్ధుడు (శాస్త) పలికిన వాక్యాలు, ఇంకా ఆయన సమక్షం లో శ్రోతలు పొందే అనుభూతిని గురించి రచయిత వర్ణన.కథలోని ముఖ్య సన్నివేశాలలో తటస్థపడే నెమలి, బౌద్ధమతస్థుల నమ్మక ప్రకారం, విశాలహృదయానికీ, అంగీకారానికీ, చిహ్నం. ( http://bit.ly/buddhismpeacock )అలాగే, రోహిణి నది వివాదం, మన దేశంలో కావేరీ జలాల సమస్య, పాలస్తీనా ప్రాంత వ్యవహారాలూ, అక్కడి జోర్డాన్ నది వినాశనం మనకు గుర్తుకుతెస్తుంది. (http://bit.ly/jordanpollution)ఈ కథ ఆడియో రూపం లో , సుప్రసిద్ధ రేడియో ఆర్టిస్ట్ శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి గళాన మీరు వినవచ్చు.కథ:రోహిణీ నది, సంధ్యాసమయంలో శాన్త భుజం మీది నుంచి జారిన కాషాయాంబరంలా వుంది. ఇప్పటి పరిస్థితి విషమిస్తే ఇరుపక్షాల రక్తంతో రోహిణికి రక్తపుజీర పడుతుందనుకున్నాడు ఉపాలి. ఉపాలి భిక్షు అంతకుముందే నదిలో స్నానించి, బట్టలు పిండుకుని, ఒడ్డుకు చేరి మంద్రంగా ప్రవహిస్తున్న నదిని చూస్తూ అట్లా అనుకున్నాడు.ఎగువ నుంచి ఒడ్డుకు సమీపంగా పొడవాటి గెడ సాయంతో వంపు తిరుగుతోంది పడవ. అట్లాగే చూస్తూండిపోయాడు ఉపాలి. మనోహరమైన సంధ్యగాలి అలలు ఉపాలి శరీరాన్ని మనసునీ మృదువుగా తాకి వెళ్లిపోతున్నాయి. ఈవలివైపు ఆమ్ర వన విహారం చేరిన కొద్ది దినాల నుంచి నదిని చూసినప్పుడల్లా, కంఠం వరకూ మునిగినప్పుడల్లా తన నుంచి తాను వేరుపడి ఆవల బాల్యం గడిపిన అస్పష్టమైన శాక్యసీమను చూశాడతను. అక్కడే ఒక రాకుమారుడు ఉదయకాంతిలోకి గుర్రం మీద వెళ్లిపోవడం కూడా జ్ఞాపకం వస్తుంది. ఈ నది వేరు, ఆ నది వేరు. అతని పెదాల్ని దాటి చిరునవ్వు వెలువ డింది. జేవురించిన సూర్యుడు, ఎర్రబారిన నది- అనేక దినాలుగా నది కావల, ఈవల రాజుకున్న ఆగ్రహావేశాల్ని తలపిస్తున్నాయి. ఉపాలితో పాటు స్నానం చేసిన భిక్షువులు అప్పటికే విహారం వేపు నడిచి వెళ్లిపోయారు. సంధ్యా సమయంలో నీడల్లా దూరంగా కనిపిస్తున్నారు. ఉపాలి భిక్షు మనసులో చిన్న కలవరం కూడా లేకపోలేదు.ఆ దినం ఉదయమే ఆనందుణ్ని అడిగాడు. “భన్తే, ఆవలితీరం భగవానుడి పుట్టుక వల్ల పునీతమైంది. ఈవల వారి నివాసం వల్ల పవిత్రమైంది. మరి ఈ కోలీయులు, శాక్యులు రక్తం చిందించడానికి ఎందుకు ఆయత్తమవుతున్నారు?”దీర్ఘంగా ఉపాలివేపు చూస్తూ అన్నాడు ఆనందుడు. “అవిద్య అత్యంత కఠినమైన స్థితి. అగ్నికి గాలివలె కాపీర్ణం, ఆగ్రహం, మనుషుల బుద్ధిని బూడిద చేస్తాయి. వర్షాన్ని కలుపుకుంటేనే నది అవుతుంది. శాస్త్ర ధర్మోపదేశం వినడం వేరు. శ్రోతాపత్తి ఫలాన్ని పొందడం వేరని నీకు తెలిసినదే.”“తలలు పగలగొట్టుకోవాలనే వారి ఉత్సాహం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది.” “పొగరుబోతు ఏనుగు తథాగతుని ముందు మోకరిల్లింది.” “సుద్ధోదన మహారాజు మౌనసందేశాలు మాత్రమే పంపుతున్నాడను కుంటాను.”నవ్వి ఆనందుడు అన్నాడు. “కానీ శాక్య ఉపాసకులు ఇక్కడకు వస్తూనే వున్నారు. శాస్తకు ఎవరి సందేశాలు, ఆహ్వానాలు అవసరం లేదుగదా?”ఆలోచనలో పడి ఉపాలి నదిమీద పల్చటి చీకటి పొర పరచుకోవడం గమ నించలేదు. పడవవాడు పడవని ఒడ్డుకు లాగి తాడు కడుతున్నాడు. పడవవాణ్ని చూడగానే అనుకున్నాడు. ఈ వ్యక్తికీ, ఈ నదికీ, ఈ పడవకీ, పడవెక్కి తీరం చేరే యాత్రికులకీ ఏమిటి సంబంధం? నవ్వుకుంటూ ఉపాలి వెనక్కి తిరిగి విహారం వేపు నడిచాడు. తీసి ఉన్న వెదురుతలుపు పక్కకి నెడుతూ శ్రేష్టి కుటుంబం, విహారంలోకి అడుగు పెట్టకముందే ఎదురు వచ్చింది. ఉపాలి ఎదురవగానే వారంతా ఆగి అభివాదం చేసి అతను లోపలికి వెళ్లేవరకూ ఆగి మరీ బయలుదేరారు.ఆమ్ర విహారం అంత పెద్దది కాదు. అనుకోకుండా శాస్త రాక గురించి తెలియడంతో విడిది ఏర్పాటు చేశారు. భిక్షకోసం జనపదంలో సంచరిస్తున్న భిక్షువుల్ని గృహపతులు ఆదరంగా ఆహ్వానిస్తున్నారు. తథాగతుడు రావడంతో నదిలోకి కొత్త నీరు ప్రవేశించినట్టయింది. సమీప జనపదాల నుంచి బళ్లు, నడక, కొంతమంది పడవల్లో జనం వచ్చి శాస్త దర్శనం చేసి ధర్మోపదేశం విని వెడుతున్నారు. శ్రేష్ఠి. ఇతర పెద్దలు కొద్దిమంది, రెండు పూటలా విహారానికి భిక్షుక సంఘాన్ని కలిసి పరామర్శించి వస్తుంటారు. మొత్తానికందరికీ తథాగతుడి రాకతో ప్రశాంతంగా, వేసవిలో చిరువర్షం, చల్లగాలిలాగా వుంది.విహారంలో కాగడాలు వెలిగించారు. కుటీరాల్లో దీపాలు వెలుగుతున్నాయి. తథాగతుడి ప్రధాన అంతేవాసులు ఆనందుడు, ఉపాలి మరో నలుగురు వృద్ధ స్థవిరులు ఆనందుడి కుటీరంలో కూచుని వున్నారు. వేడిపాలు సేవించారందరూ. ఆనందుడు ఉత్తరీయం తీసి ఒళ్ళో వేసుకుని రెండు చేతులు వెనక్కి నేలమీద ఆనించి నిట్రాటకు అనుకుని అందరివేపూ చూశాడు. మట్టి దీపాల వెలుగు ఆయన శరీరం మీద కదులుతూఉత్తరీయం కప్పుతున్నట్టుంది. ఉపాలిని చూస్తూ చటుక్కున అన్నాడు ఆనందుడు.“త్వరలో శాక్యులు పెద్దమనుషుల్ని పంపుతారని వినికిడి.”“అనగా రాజకుటుంబం, అధికారులు…”“కాదు… వారి అనుమతితోనే శాస్తను సంప్రదించడానికి వస్తున్నారు,” ఒక వృద్ధ స్థవిరుడన్నాడు.“స్వయంగా శాస్త శాక్యసీమ వస్తాడని నమ్మకం సడలి వుంటుంది. సుద్దోధనుడి ఆంతర్యం అదే అయి వుంటుంది.”మరో స్థవిరుడన్నాడు. “ఇది శుభసూచకం. ఇక్కడ శాస్త వుండగా ఇరుపక్షాలూ యుద్ధానికి దిగడం మంచిదికాదు. అప్పుడే ఆయుధాలు సమకూర్చుకుంటున్నారని వింటున్నాం. పెద్ద కర్రలు, విల్లమ్ములు, రాళ్లు రేవు దగ్గరికి చేర్చడానికి సిద్ధంగా వున్నారు. మహిళలు కూడా వెదురుశూలాల్ని సూదిగా చెక్కి సిద్ధం చేస్తున్నారు.” .ఆనందుడు తల వూపుతూ అన్నాడు. “సాగునీటిని నిరోధించడం, చెరువుల్ని కలుషితం చెయ్యడం పాపకర్మలు. వర్షం అందరికోసం పడుతుంది. నదికి నీరిస్తుంది. ఏ ఒకరికోసమో దాచి ఇవ్వదు. నదీధర్మాన్ని అర్థం చేసుకోవాలి. నదిని అడ్డగించి సాగునీటి కోసం ఒకరినొకరు చంపు కోవడం పాపకర్మకు పరాకాష్ఠ. పొగరుబోతు ఎడ్లలా ఒకరినొకరు పొడుచుకోవడానికి సిద్ధపడుతున్నారు.”“అవును. అయినా రాజధర్మం విస్మరించిన తరువాత ప్రజలు మూర్ఖులవడం ఆశ్చర్యం లేదు.” అన్నాడు ఉపాలి. మళ్లీ అతనే స్థవిర మిత్రుల్ని చూస్తూ అన్నాడు. “యుద్ధం వరకూ వెళుతుందని నేను అనుకోవడం లేదు.”స్థవిరులు తలలూపేరు. చాలా సేపటి వరకూ ఎవరి ఆలోచనల్లో వారుండి పోయారు. విహారంలో ఏదో పక్షికూత దూరంగా వినిపించింది. అందరూ కుటీరంలో మేల్కొన్నారు. ఉపాలి మనసు శాంతించింది.ఆనందుడు అన్నాడు. “ఇక్కడ సమస్య ప్రధానం కాదు. సమస్యను అర్థం చేసుకునే దృష్టి ముఖ్యం. దానివల్ల సమస్య పరిమితులు అర్థం అవుతాయి. అది వారికి తెలియవలసిన విషయం.”ఎక్కడో శుభ్రంగా స్నానించి సూర్యుడు రోహిణి నదిలో లేత బంగారం కలుపుతున్నాడు. ఆమ్ర విహారంలో పక్షులు లేత సూర్యకాంతిని తింటూ నదివేపు ఎగిరి పోయాయి. స్థవిరులు , కొద్దిమంది ఉపాసకులు వెంటరాగా పెద్ద బంగారు గొలుసులా మెరుస్తున్న రోహిణిలో శాస్త స్నానానికి దిగాడు. చల్లటి ఉదయపు గాలివల్ల నదీ తరంగాలు శాస్త దేహాన్ని స్పృశించడానికి వేగిరపడుతున్నాయి. వ్యక్తమౌతున్న వెలుగు ముడతలు పడి కదులుతున్న నది, మునిగి తేలుతున్న శాస్త శరీరం అవిభాజ్యంగా కనిపించాయి. మనోహరమైన ఈ దృశ్యం ప్రతిదినమూ అంతేవాసులందరూ చూస్తూనే ఉన్నా, ఎప్పటికప్పుడు, ప్రతి ఉదయం ఒక నూతన శుభ్రధావళ్యాన్ని సంతరించు కుంటున్నట్టు అనిపిస్తోంది. తథాగతుడి దేహం ఉదయకాంతిని పీల్చుకోగానే ఆయన తిరిగి విహారానికి బయలుదేరాడు.విహారంలో ఎక్కడివారక్కడ చెట్లకింద, దారి కటూ ఇటూ నిశ్శబ్దంగా నుంచుని శాస్త అభివాదం చేశారు. ఎక్కడో చెట్టుకింద నుంచుని గొప్ప ఆశతో నెమలి కూసింది. నిశ్శబ్దాన్ని పూరించింది మయూర ఓంకారం. మరికాసేపటికి ఎప్పటిలాగే పెద్ద మామిడి చెట్టు కింద తాటి ఆకుల చాప వేసి దానిమీద గుడ్డ వేసి రెండు దిండు ఏర్పాటుచేశారు. భిక్షువులు, ఉపాసకులు, కొద్దిమంది జానపదులు, శాస్త ఆసీనుడైన తరువాత కూచున్నారు. చెట్లు ఆకులు తొడిగినట్టు వారి శరీరాలకు మొత్తం చెవులు మొలిచాయి.తథాగతుడు సంపద మీద, సంపద పంచుకోవడం గురించి, వితరణ. క్లుప్తమైన ధార్మికజీవనం గురించి, సమ్యక్ దృష్టి గురించి ఉపదేశం ప్రారంభించాడు. “పండ్ల చెట్టు విడిచిన పండ్లని ఏరుకుని తినడం వేరు. చెట్టుని కుదిపి కుదిపి కాసిని పళ్లు తీసుకుని ఎక్కువ పళ్లను వదిలివెయ్యడం అపరాధం,” అన్నాడు శాస్త. మళ్లీ ఎక్కడ్నుంచో అర్థమైందన్నట్టుగా నెమలి కూసింది. “ఒక నియతి ఉంటుంది. ఆయుష్మంతులారా, ఈ నియతిని అర్థం చేసుకోవడం మన ధర్మం,” అన్నాడాయన. శాస్త్ర మాట్లాడుతున్నంత సేపూ ఒక మంగళకరమైన శాంతి ఏదో అందర్నీ మృదువుగా ఆవరిం చింది.రోహిణి నది ఎండకి వేడెక్కుతూ నిర్లిప్తంగా నీరసించి సాగుతోంది. ఎప్పుడూ లేనంతగా ఈసారి నది నీరసించడం వల్లనే రోహిణి బిడ్డలిద్దరూ పరస్పరం చంపుకోడానికి సిద్ధపడ్డారు. పాలు పల్చనైపోయిన తల్లి రొమ్ములు కొరుక్కు తినే బిడ్డల్లా తయారైనారు. రోహిణి శాక్య కోలీయుల రాజ్యాన్ని విడదీస్తూ వెళుతుంది. లేదా ఇరువురికీ మధ్యగా వెడుతోంది. ఇరువేపుల కర్మకారులూ నదికి అడ్డంగా గట్టు...
NOW PLAYING
రోహిణి - పతంజలి శాస్త్రి గారి కథ , కథా పరిచయం
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.